మేడ్చల్: దూసుకొస్తున్న రేసు గుర్రాలు



మేడ్చల్‌ నియోజకవర్గంలో ప్ర‌చారంలోకి దిగిపోయాయి ప్ర‌ధాన పార్టీలు. గెలుపు కోసం తీవ్ర క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టేశారు. ఈ సారి ఈ సెగ్మెంట్‌లో రాజకీయం ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌స్తున్న స‌ర్వేల సర‌ళిని బ‌ట్టి చూస్తే.. ఇక్క‌డ ఈసారి బీసీ ప్ర‌భావం బ‌లంగా ఉండేలా క‌నిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడు సార్లు బీసీ నేతలు, రెండుసార్లు ఎస్‌.సి. నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు. మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ లు కలిసి ఏడుసార్లు గెలిస్తే, టీడీపీ నాలుగుసార్లు గెలిచింది. టీఆర్‌ఎస్‌ రెండుసార్లు గెలిచింది.

మేడ్చల్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మ‌ల్లారెడ్డి ఆర్థికంగా బ‌లంగా ఉండ‌టం త‌ప్పా ఆయ‌న‌కు మ‌రో ప్ల‌స్ పాయింట్ లేదు. ఇటీవ‌ల ఆయ‌న మాట‌ల‌తో ఆయ‌న ఇమేజ్‌ను త‌గ్గించుకున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ బీఆర్ఎస్ మీటింగ్ జరిగినా.. వీరిద్దరు ఎడమొహం పెడమొహం పెట్టుకుంటారు. వీరిద్దరి మధ్య విభేదాలు ప‌లుమార్లు బహిర్గతమయ్యాయి. అయితే మ‌ల్లారెడ్డికి ఈ సారి టికెట్ రాక‌పోవ‌చ్చ‌నే టాక్ కూడా వినిపిస్తోంది. అవినీతి ఆరోపణలు, స్థానిక కేడర్ లో సఖ్యత లేక‌పోవ‌డం, కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వకపోవటం, వర్గపోరు, ఎవరినైనా డబ్బుతో కొనేస్తా.. అనే వైఖరి ఇలాంటి వాటితో పాటు ఈ సారి కేటీఆర్ కోటరీకే ఎక్కువ ప్రాధాన్యత వుండనున్న నేపథ్యం.. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డికి విశ్రాంతి ఉండొచ్చు అంటున్నారు విశ్లేష‌కులు. మ‌ల్లారెడ్డికి టికెట్ ఇవ్వ‌కుంటే ఆయ‌న కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి ఇచ్చే అవ‌కాశం కూడా ఉంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్లూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ నుంచి ఈ సారి ఎవ‌రో ఒక్క‌ ‘రెడ్డి’కే అవ‌కాశం అన్న‌మాట‌.

బీజేపీ ప్ర‌య‌త్నాలు..
ఈ సెగ్మెంట్‌లో ఈ సారి బ‌లం పెంచుకోవాల‌ని ఉవ్వీళ్లూరుతోంది బీజేపీ. ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి కొంపల్లి మోహన్ రెడ్డి లేదా పటోళ్ల విక్రమ్ రెడ్డి.. ఎవరికి పార్టీ అవకాశం ఇస్తుందా అనే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.. ఇద్దరి సామాజిక వర్గం ఒకటే అయినా గత ఎన్నికల అనుభవం, కేడర్ లో పట్టు, ఆర్థిక సామర్థ్యం కొంపల్లి కి వున్న అదనపు బలం. ఇంకా విక్రమ్ రెడ్డి కి ఈ మధ్య కాలంలో పెరిగిన కాడర్.. పార్టీ పనులలో చురుకుగా వ్యవహరించండం అధిష్టానం దగ్గర కలిసొచ్చే అంశం. ఎవరు ఎన్నికలలో పోటీ చేసినా.. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు, సాంప్రదాయ ఓటుతో టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. క‌మలంలో కూడా ఇద్ద‌రు రెడ్డిల్లో ఒక‌రు టికెట్ అందుకోవ‌డానికి రేసులో ముందున్నారు.

ఇక చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న మేడ్చ‌ల్ నుంచి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు కూడా తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ గా పోటీ చేసిన ఎన్నికల అనుభవం, మాటల బలం ఒకింత కలిసొచ్చే అంశం. తీన్మార్ మ‌ల్ల‌న్న పోటీ చేస్తే గ‌న‌క బీఆర్ఎస్ ఓట్ల‌ను చీల్చే అవ‌కాశం క‌నిపిస్తుంది.

కాంగ్రెస్‌లో క్లారిటీ?
మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బ‌లం భారీగానే ఉంది. ఈ నేప‌థ్యంలో టికెట్ ఎవ‌రికి అనే విష‌యం ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు తోటకూర జంగయ్య యాదవ్ ఆలియ‌స్ వ‌జ్రేష్ యాద‌వ్. ప్ర‌స్తుతం టీ-పీసీసీ ఉపాధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న వ‌జ్రేష్ యాద‌వ్.. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావ‌డంతో కాంగ్రెస్ నుంచి ఆయ‌న‌కు సీటు ఖరారు అయినట్టే అనే టాక్ వినిపిస్తుంది. కుల గణాంకాలు.. రేవంత్ రెడ్డి చరీష్మా.. స్థానిక ఎంపీగా తన పలుకుబడి, గత ఎన్నికల అనుభవం, ఆ ఎన్నికలలో ఓటమి తో పెరిగిన సానుభూతి, ప్రధానంగా బీసీ వర్గం నుంచి మద్దతు వుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవ‌ల‌ స్థానికంగా కాంగ్రెస్ బ‌లం పుంజుకున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ సారి ఎన్నికలలో ‘రెడ్డి’ వర్గాన్ని కాదని బీసీ వర్గానికి కనుక పార్టీ టికెట్ ఇస్తే మాత్రం తోటకూరకు గెలుపు అవ‌కాశాలు ఎక్కువే. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ, ప్ర‌భుత్వ విధానాల‌ను నిర‌సిస్తూ ధర్నాలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు వ‌జ్రేష్ యాద‌వ్. దీంతో స్థానికంగా ఆయ‌న పేరు మారుమోగిపోతోంది.

ఈ ఎన్నిక‌ల‌ను బీసీ ఓటింగ్ మాత్ర‌మే ప్ర‌భావం చూపిస్తుంది. బీఆర్ఎస్, బీజేపీల్లో రెడ్డిలు బ‌రిలోకి దిగితే ఈసారి కాంగ్రెస్ నుంచి బీసీ అభ్య‌ర్థికి టికెట్ ఇస్తే ఆ ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని విశ్లేష‌కుల మాట‌. బీఆర్ఎస్ నుంచి మ‌ల్లారెడ్డికానీ, ఇత‌రులు కానీ రంగంలోకి దిగితే కాంగ్రెస్ నుంచి వ‌జ్రేష్ యాద‌వ్ బ‌లంగా ఢీ కొట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *